తిండి గింజల దొంగలు | Sakshi Special Story About Farmer Good Names | Sakshi
Sakshi News home page

తిండి గింజల దొంగలు

Feb 23 2026 6:01 AM | Updated on Feb 23 2026 6:01 AM

Sakshi Special Story About Farmer Good Names

తాత్త్వికథ

ఒక ఊర్లో ఓ జమీందారు ఉండేవాడు. పదిమందికీ సహాయం చేయాలనే తపన కలిగిన వాడు. తను సంపాదించిన దాంట్లో కొద్ది మొత్తం పక్కన పెట్టి పేదవారికి లేదనకుండా ఆదుకునేవాడు. దాంతో అతడికి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంచివాడనే పేరు వచ్చింది.

కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి కొండ వెనుక ఉన్న గ్రామంలో ఒక రైతు ఉన్నాడని, అతడు చాలా మంచివాడని తెలుసుకున్నాడు. ఆ రైతు గురించి ఎంతో గొప్పగా ప్రచారం జరుగుతుండటంతో ఆ రైతును చూడాలన్న కుతూహలం జమీందారుకు కల్గింది.

తమ తోటలోని తియ్యటి మామిడి పండ్లను సంచిలో పెట్టుకుని సేవకుడిని తోడు చేసుకుని బయలుదేరాడు. రైతుకు అంత మంచి పేరు రావడానికి కారణం ఏమై  ఉంటుందోనని ఆలోచన చేస్తూ నడవసాగాడు. చిన్నగా కొండ దాటి రైతు ఉన్న గ్రామం చేరాడు. అప్పటికే  రాత్రి ఒంటిగంట అయ్యింది.

అది వరి నూర్పిడికి సిద్ధంగా ఉన్న కాలం.  రైతు తన పొలం వద్ద నార మంచం మీద పడుకుని ఉన్నాడు. రైతు పొలంలోకి నలుగురు దొంగలు దూరి ఉన్నారు. వారు వడ్లను మూటల్లోకి నింపుకుంటున్నారు. దొంగల అలికిడికి రైతు లేచి కూర్చున్నాడు. అప్పటికే దొంగలు వడ్లతో నింపిన రెండు మూటలను కట్టి పక్కన పెట్టి ఉన్నారు.

రైతు లేచింది చూసి దొంగలు పరిగెత్తబోయారు. వెంటనే రైతు ‘‘ఎందుకు పరిగెత్తుతున్నారు, పరిగెత్తకండి. నేను మీ దగ్గరకు రాను. ఉన్నచోటు నుంచి అంగుళం కూడా కదలను. ఇక్కడే మంచం దగ్గరే ఉంటాను. కడుపుకు లేకనే కదా మీరు దొంగతనం చేస్తున్నారు. ఎన్ని మూటల వడ్లు కావాలో తీసుకెళ్ళండి. నేను మీ జోలికి  రాను, ఎవ్వరికీ ఫిర్యాదు చేయను’ అని గట్టిగా అరిచి చెబుతున్నాడు. అయినా దొంగలు వినలేదు. ఎక్కడివక్కడ పారేసి పరుగులు తీస్తూ పారిపోయారు.

‘అయ్యో... ఎంత పాపం చేశాను. నేను నిద్ర లేచిన దానివల్ల కదా వాళ్ళు వడ్లు ఎత్తుకుని వెళ్లలేకపోయారు. ఎంతో ఆకలైతే కానీ తిండిగింజల దొంగతనానికి రారు. వారి నోటికాడ కూడు తీసినాను కదా’ అని ఏడుస్తూ కూర్చున్నాడు. అదంతా కళ్ళారా చూసిన జమీందారు చలించిపోయాడు.

‘నేను సంపాదించిన దాంట్లో కొంత మాత్రమే పేదలకు పెడుతున్నాను. ఈ రైతు చూడు, తనకి చెడ్డ చేసే వాళ్ళ మంచి కూడా కోరుతున్నాడు. వారి ఆకలికేకల గురించి ఆలోచిస్తున్నాడు. ఇది కదా మానవత్వమంటే. ఇది కదా మంచితనమంటే’ అనుకుంటూ ఆ రైతుకు నమస్కరించి తను తెచ్చిన పండ్లు అతడి చేతికిచ్చి వెనుదిరిగాడు.

– ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు
 

Advertisement
 
Advertisement
Advertisement