
పదవీ విరమణ వెంటనే పదవులు తీసుకోవడం సరైంది కాదు
సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వంటివి ప్రజల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. అంతిమంగా న్యాయ వ్యవస్థలో నిజాయతీ, సమగ్రతపై ప్రజలు నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యునైటెడ్ కింగ్డమ్ సుప్రీంకోర్టులో ‘న్యాయ వ్యవస్థ సమగ్రత, ప్రజల విశ్వాసం కొనసాగింపు’ అనే అంశంపై తాజాగా జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు.
న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయడాన్ని, ప్రభుత్వ పదవులు స్వీకరించడాన్ని తప్పుపట్టారు. ఇది నైతికతకు సంబంధించిన అంశమని, ప్రజల పరీక్షకు గురి కావాల్సి ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో దక్కబోయే పదవులను దృష్టిలో పెట్టుకొని జడ్జీలు తీర్పు లు ఇస్తారని ప్రజలు భావించే ప్రమాదం ఉందన్నారు.
న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పక్షపాతంపై సందేహాలు తలెత్తుతా య న్నారు. పదవీ విరమణ తర్వాత ఎలాంటి పదవు లు స్వీకరించబోమంటూ తనతోపాటు మరికొందరు సహచరులు ప్రమాణం చేసినట్లు వెల్లడించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత, విశ్వసనీయతను పరిరక్షించాలన్న ధ్యేయంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. అలాగే న్యాయ వ్యవస్థలో అవినీతి, దుష్ప్రవర్తన వెలుగులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ జోక్యం వద్దు...
కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో రాజకీ య, ప్రభుత్వ జోక్యం ఉండరాదని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు. కొలీజియం వ్యవస్థను ఆయన సమర్థించారు. ఈ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం ఉండడం లేదన్న వాదనను ఖండించారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో న్యాయ మూర్తుల స్వతంత్రత అనేది అత్యంత కీలకమని స్పష్టంచేశారు. శాసన లేదా కార్యనిర్వాహక వ్యవ స్థల చట్టబద్ధత బ్యాలెట్ ద్వారా ఏర్పడుతుందని గుర్తుచేశారు. కానీ, జ్యుడీషియరీ చట్టబద్ధత రాజ్యాంగ విలువల పరిరక్షణతో అనుసంధానమై ఉంటుందన్నారు.