బనకచర్లను అడ్డుకోండి | CM Revanth adn Uttam complain to CR Patil about Polavaram Banakacharla project | Sakshi
Sakshi News home page

బనకచర్లను అడ్డుకోండి

Jun 20 2025 2:31 AM | Updated on Jun 20 2025 2:31 AM

 CM Revanth adn Uttam complain to CR Patil about Polavaram Banakacharla project

తెలంగాణ ప్రయోజనాలకు ఈ ప్రాజెక్టుతో విఘాతం

ఎలాంటి అనుమతులు, ఆర్థిక చేయూతనివ్వొద్దు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌కు సీఎం రేవంత్, ఉత్తమ్‌ ఫిర్యాదు

గోదావరిలో 1,000, కృష్ణాలో 500 టీఎంసీల వినియోగానికి ఎన్‌వోసీ ఇవ్వండి

పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, అన్ని అనుమతులు మంజూరు చేయండి

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014లకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. 

ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జల్‌శక్తి మంత్రి పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్‌తోపాటు ఎంపీలు మల్లురవి, రఘువీర్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ గురువారం సమావేశమయ్యారు. బనకచర్ల అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళన నెలకొందని వివరించారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెబుతోందని.. జీడబ్ల్యూడీటీ–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదన్నారు. 

2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా నూతన ప్రాజెక్ట్‌ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించి అనుమతి పొందాలని, అయితే బనకచర్ల విషయంలో ఏపీ వీటన్నింటిని ఉల్లంఘిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, జల్‌శక్తి శాఖ తక్షణమే జోక్యం చేసుకొని బనకచర్ల ప్రాజెక్ట్‌ ముందుకెళ్లకుండా చూడాలని రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కోరారు.

వరద నిజమైతే ఇచ్చంపల్లి–సాగర్‌ అనుసంధానంపై చర్చిద్దాం
సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి పాటిల్‌కు రేవంత్, ఉత్తమ్‌ వివరించారు. గోదావరి అవార్డు ప్రకారం పోలవరం డిజైన్లు మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతోందని, తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు కొనసాగిస్తూనే ఉందని చెప్పారు. 

గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం–బనకచర్లకు బదులు, కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి–నాగార్జున సాగర్‌ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లో రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. కేంద్రం స్పందన సానుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం స్పష్టం చేశారు.

1,500 టీఎంసీలను వాడుకునేలా..
» తెలంగాణకు గోదావరి నదిలో 1,000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల్‌శక్తి శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) జారీ చేయాలని, దానికి కేంద్రం ఆమోదం తెలపాలని సీఆర్‌ పాటిల్‌కు రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. 1500 టీఎంసీల నీటితో కోటి న్నర ఎకరాలకు నీరు అందుతుందని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీ లిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.
»  ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు అనుమతు ల ప్రక్రియలో సత్వరం స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం తగదని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నా రు. పాలమూరు–రంగారెడ్డి, సమ్మక్క–సారక్క, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకా ల అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు.
» గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి పాటిల్‌కు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement