బెంగళూరు: కాంగ్రెస్లో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యపై చేతబడి జరిగిందేమో అని అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి కేఎన్.రాజణ్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంగళవారం బెంగళూరు నగరంలో మాట్లాడిన కేఎన్.రాజణ్ణ.. సీఎం ఇంత అసహాయకుడిగా ఉండటం చూస్తే అతడిపై ఎవరైనా చేతబడి చేశారా అనిపిస్తుందని.. దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం సైలెంట్గా ఉన్నారని ఎవరైనా చెబితే అది నిజమే అనిపిస్తుందన్నారు. చేతబడి ఎవరు చేశారు అనే దానిపై విచారిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తాను ఎన్నికల్లో నిలబడినప్పుడు పాత ఇంటి చుట్టూ పసుపు నీరు చల్లి చేతబడి చేశారని గుర్తు చేశారు. అయినా దానిని పట్టించుకోలేదని.. ఎన్నికల్లో గెలుపొందినట్లు పేర్కొన్నారు. మే నెలలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవచ్చన్నారు. సీఎం చేతగాని వ్యక్తి కాదని.. రానున్న రోజుల్లో అన్ని సర్దుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు.


