
భారత ఆర్మీ జనరల్ చీఫ్ ఎం ఎం నరవాణే (ఫైల్ఫోటో)
డ్రాగన్ దక్షిణ చైనా సముద్ర వ్యూహం మా దగ్గర పని చేయదు
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు ముగింపు దశకు చేరుకున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద భారత్–చైనా సైనిక బలగాలను ఉపసంహరించుకున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం ఎం నరవాణే బలగాల ఉపసంహరణ ఇరు దేశాల సమిష్టి విజయం అన్నారు. అంతేకాక దళాల తొలగింపు, విస్తరణ వంటి తదుపరి చర్యలకు చాలా సమయం పడుతుందన్నారు. లద్దాఖ్ ఉద్రిక్తతల సమయంలో చైనా, పాకిస్తాన్ల మధ్య బహిరంగ కలయిక సంకేతాలు లేవని స్పష్టం చేశారు నరవాణే.
కానీ ఇండియా మాత్రం ఈ రెండు ప్రధాన శత్రువులతో పాటు అంతర్గత భద్రత అనే మరో సగం సమస్యను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉందని.. ఈ మేరకు ఈ రెండున్నర శత్రువులతో తలపడేందుకు దీర్ఘకాలిక వ్యూహ రచన చేస్తోందని వెల్లడించారు. దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత మరికొన్ని అంశాల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు నరవాణే.
"మనం ఏమి చేస్తున్నామో, దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మేం ఎల్లవేళలా గుర్తుంచుకుంటాము. మేము చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇరు దేశాల మధ్య విశ్వాస లోపం ఉంది. దాన్ని తొలగించే వరకు మే చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎల్ఏసీ వద్ద ఇరువైపులా జరిగే ప్రతి కదలికను జాగ్రత్తగా గనిస్తాం’’ అని తెలిపారు నరవాణే. సరిహద్దు వివాదాల సమస్యలకు హింస ఎన్నటికి పరిష్కారం కాదన్నారు నరవాణే.
చైనాకు ప్రారంభం నుంచి ముందుకు పాకే అలవాటు ఉందని.. దాని వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి అన్నారు నరవాణే. అయితే ప్రతి మార్పుకు సంబంధించి ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఇక దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ అనుసరించిన వ్యూహం భారత్తో పని చేయదని స్పష్టం చేశారు. ఇక ఉద్రికత్తలు ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం, ఆర్మీ అందరు కలిసి సమిష్టిగా పని చేశారని.. వాటి ఫలితమే ఈ రోజు మనం చూస్తున్న బలగాల ఉపసంహరణ అన్నారు నరవాణే.
చదవండి:
భారత్-చైనా యుద్ధం కాస్తలో తప్పింది..!
తూర్పు లద్దాఖ్ నుంచి వెనక్కి మళ్లుదాం