సిబ్బందికి ఎయిరిండియా కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: కేబిన్ సిబ్బంది ఫిట్నెస్ విషయమై ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. బరువు పెరిగితే జీతంలో కోత విధించనుంది. ఇక, బరువు, ఫిట్నెస్ అసెస్మెంట్ మీదే సిబ్బంది జీతం, ఉద్యోగం ఆధారపడి ఉండనున్నాయి!
బీఎంఐ 18 నుంచి 24.9 మధ్య ఉంటేనే
బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) రీడింగ్ 18 నుంచి 24.9 మధ్య ఉంటే సాధారణ బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు పరిగణిస్తారు. 18 కంటే తక్కువగా ఉంటే తక్కువ బరువున్నవారిగా అంచనా వేస్తారు. బీఎంఐ 25 నుంచి 29.9 మధ్య ఉంటే వారు అధిక బరువు కేటగిరీలోకి వెళ్తారు. ఇక బీఎంఐ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు. బీఎంఐ 18 కంటే తక్కువగా ఉన్నా, 25 నుంచి 29.9 మధ్య ఉన్న సిబ్బందిని విధుల నుంచి తొలగించి, వారిని ఫంక్షనల్ అసెస్మెంట్కు పంపిస్తారు.
అందులో ఉత్తీర్ణులై, ఆరోగ్యంగానే ఉన్నారని, విధుల్లో కొనసాగడానికి అర్హులని నిర్ధారణ అయితేనే వారిని కొనసాగిస్తారు. ఫంక్షనల్ అసెస్మెంట్లో విఫలమైతే.. అర్హత ప్రమాణాలను చేరుకునేవరకూ వారి జీతంలో కోత (లాస్ ఆఫ్ పే) విధిస్తారు. ఊబకాయంతో ఉన్నవారిని విధుల నుంచి తొలగించడమే కాకుండా తక్షణమే వేతనం నిలిపేస్తారు. వారు నిర్దిష్ట కాల వ్యవధిలో తమ బీఎంఐని ఆరోగ్యకరమైన స్థాయిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో వారిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తారు.
శిక్షణలో ఉన్నవారికీ వర్తింపు...
మే 1 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం ప్రస్తు™è ం పనిచేస్తున్న క్యాబిన్ సిబ్బందితోపాటు శిక్షణ పొందుతున్న వారికీ వర్తించనుంది. సిబ్బందికి ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కలి్పంచడం, సరైన బరువుతో ఉండేలా చూడటం కోసమే ఈ విధానాన్ని ప్రారంభించినట్టు ఎయిరిండియా తెలిపింది. మెరుగైన ఫిట్నెస్ ప్రమాణాలను అమలు చేయడానికి ముందు సన్నాహక చర్యగా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఎయిరిండియాను 2022 జనవరిలో టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. సంస్థ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించి, నాలుగేళ్లలో పాత ఉద్యోగుల్లో ఎక్కువ మందిని దశలవారీగా తొలగించింది.


