న్యూఢిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ద్వారా వివిధ దేశాల నుంచి 250 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలు రాబట్టినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే మరో 20 బిలియన్ డాలర్ల మేర డీప్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఈ సదస్సు పూర్తి స్థాయిలో విజయవంతమైందని శుక్రవారం హర్షం వ్యక్తంచేశారు. మౌలిక సదుపాయల రంగంలో ఈ పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు.
ప్రతిపాదిత ఢిల్లీ డిక్లరేషన్కు 70 దేశాలు ఇప్పటికే మద్దతు పలికాయని అన్నారు. శనివారం కల్లా ఈ సంఖ్య 80కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. డిక్లరేషన్పై శనివారం సంతకాలు జరుతాయని వివరించారు. సదస్సును 5 లక్షల మందికిపైగా ప్రజలు సందర్శించారని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచ దేశాలు గుర్తించాయని స్పష్టంచేశారు. ఢిల్లీ డిక్లరేషన్పై పూర్తి వివరాలను సదస్సు ముగిసిన తర్వాత బహిర్గతం చేస్తామని అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇండియా ఏఐ మిషన్ 2.0లో భాగంగా 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇవ్వబోతున్నట్లు స్పష్టంచేశారు.


