
ఢిల్లీ: భారత్లో రోజురోజుకూ కోవిడ్–19 యాక్టివ్ కేసులు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో కొత్తగా 1,131 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. దేశంలో ఆదివారం ఉదయం 8 గంటల నాటికి కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 6,133కి చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కోవిడ్తో దక్షిణాది రాష్ట్రాల్లో ఆరుగురు మృతి చెందారు. కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, తమిళనాడులో ఒకరు మృతి చెందారు. కేరళలో 1950, గుజరాత్లో 822, బెంగాల్లో 693, మహారాష్ట్రలో 595, కర్ణాటకలో 366, ఏపీలో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ మృతుల సంఖ్య కూడా పెరగడంతో మరో ‘కరోనా వేవ్’ముంచెత్తుతుందా అన్న భయాలు సైతం వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్నాయి. కేరళలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి.
కేరళలో శనివారం నాటికి (గత 24 గంటల్లో) 192, గుజరాత్లో 107, పశ్చిమబెంగాల్లో 58, కర్ణాటకలో 15, ఆంధ్రప్రదేశ్లో 12 కొత్త యాక్టివ్ కేసులు వెలుగు చూశాయి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేసుల వ్యాప్తికి కారణమైన ఒమిక్రాన్ సబ్వేరియెంట్లు, లీనియేజ్లు ఎగువ శ్వాసకోశ వ్యవస్థ (అప్పర్ రెస్పిరేటరీ) పైనే ప్రభావం చూపుతున్నందున పెద్దగా భయపడాల్సిన పనిలేదని వైద్య నిపుణులు అంటున్నారు.
