జెండా ఊపనున్న ప్రధాని మోదీ
టికెట్ ధర రూ.2,300– రూ.3,600
వెల్లడించిన రైల్వే మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గౌహతి–కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలపైకి ఎక్కనుంది. ఈ రైలును మరో 15–20 రోజుల్లో, అంటే జనవరి 18 లేక 19వ తేదీల్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కచి్చతమైన షెడ్యూల్ ఖరారవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. మొత్తం 16 బోగీలుండే ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చన్నారు.
గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఇది నడుస్తుందని ఆయన వివరించారు. అయితే, ప్రస్తుతానికి 120–130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించనుందన్నారు. విమాన ఛార్జీలతో పోలిస్తే వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ ధరలు చాలా చౌక అని చెప్పారు. గౌహతి–కోల్కతా విమాన ప్రయాణ ఖర్చు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుందని గుర్తు చేసిన ఆయన.. వందే భారత్ థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.2,300, సెకండ్ క్లాస్ ఏసీ రూ.3 వేలు, ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ ధర రూ.3,600 వరకు ఉంటాయన్నారు. ఆహారం ధర కూడా ఇందులోనే కలిపి ఉంటుందని మంత్రి చెప్పారు.
గౌహతి నుంచి మొదలయ్యే రైలులో అస్సామీల ఆహారం, కోల్కతా నుంచి మొదలయ్యే రైలులో బెంగాలీ భోజనం అందుబాటులో ఉంటాయని చెప్పారు. మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను నిర్ణయించామన్నారు. ఫస్ట్క్లాస్ ఏసీ అయితే కిలోమీటరుకు రూ.3.8, సెకండ్ క్లాస్కు రూ.3.1, థర్డ్ క్లాస్ ఏసీ కిలోమీటరు ప్రయాణానికి రూ.2.4 వరకు చార్జీ ఉంటుందని చెప్పారు. గౌహతి–కోల్కతా వందేభారత్ స్లీపర్ రైలులోని 16 కోచ్లకు గాను 11 థర్డ్ ఏసీ కోచ్లు, నాలుగు సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు, ఒక ఫస్ట్క్లాస్ ఏసీ ఉంటాయని తెలిపారు. అత్యంత భద్రతా ప్రమాణాలు, శుభ్రత, సుఖంగా ఉండే సీటింగ్, ఆటోమేటిక్ డోర్లు, ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ కవచ్ దీని ఇతర ప్రత్యేకతలని వివరించారు.


