కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ అదనపు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కర్నూలులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షిపై నమోదైన కేసులో న్యాయపరమైన విచారణ ప్రక్రియకు సంబంధించి బుధవారం ఆయన కోర్టులో వాదనలు సమర్పించారు. విచారణ అనంతరం న్యాయ స్థానం ప్రాంగణంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు జి.స్వాములు, ఇతర న్యాయవాదులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తోందని విమర్శించారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిపై పెట్టిన కేసు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్నారు. పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు బనాయించినప్పటికీ తమకు న్యాయస్థానాలపైన, రాజ్యాంగంపైన పూర్తి విశ్వాసముందన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతు ఉందని, న్యాయపరంగా పూర్తి అండగా నిలుస్తామని వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చట్టం ముందే తేల్చుకుంటామని, న్యాయ పోరాటం ద్వారా నిజాలను బయట పెట్టి ఎమ్మెల్యే విరుపాక్షికి న్యాయం జరిగేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పి.సువర్ణ రెడ్డి, న్యాయవాదులు హనుమంతు రెడ్డి, జలందర్, వెంకటేశ్వర రెడ్డి, నరేంద్ర రెడ్డి, జీవన్ సింగ్, స్థానిక న్యాయవాదులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.


