నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని పేద ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయవాది ఏర్పాటు చేస్తామని కర్నూలు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. నందికొట్కూరులోని సబ్జైల్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముద్దాయిలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. వృద్ధులై 70 ఏళ్లకు పైబడిన వయస్సు ఉన్న వారికి, అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత న్యాయసహాయం అందిస్తామని తెలిపారు. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ గురించి సీనియర్ సివిల్ జడ్జి ఎ. శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటర్లకు వివరించారు. సబ్జైల్లో వంటలను పరిశీలించారు. ఖైదీలకు ఆరోగ్య వైద్య పరీక్షలను డాక్టర్ ప్రవీణ్ చేశారు. సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ సిస్టం పానల్ న్యాయవాది వెంకటేశ్వర్లు, పారా లీగల్ వలంటీర్లు శోభారాణి, చిన్నరాజు పాల్గొన్నారు.


