డోన్ టౌన్: మండలంలోని ఓబులాపురం బుధవారం జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు(40) నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందినట్లు రూరల్ సీఐ రాకేష్ తెలిపారు. గురువారం ఉదయం కుంట వైపు వెళ్లిన వారు నీటిలో తేలాడుతున్న శవాన్ని గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్లో ముగ్గు వ్యాపారం చేస్తున్న మృతుడు గత మూడు నెలలుగా ఓబులాపురంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ఈశ్వరమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రామాంజనేయుల మృతి పట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మృతుడు తిరిగి కుంట వద్దకు ఎందుకు వెళ్లాడని, ఇతర కారణాలు ఉన్నాయా.. ప్రశ్నిస్తున్నారు.


