కొత్తపల్లి: కొలనుభారతి దేవి క్షేత్ర అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,76,373 వచ్చిందని శ్రీశైలం దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు తెలిపారు. గురువారం శివపురం సమీపంలోని కొలనుభారతి క్షేత్ర ప్రాంగణంలో దేవదాయశాఖ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ.. గత 7 నెలల 15 రోజులకు సంబంధించి హుండీని లెక్కింపు చేశామన్నారు. ఇందులో రూ.3,76,373 ఆదాయం వచ్చిందన్నారు. దీంతో పాటు 300 మిల్ల్లీ గ్రాముల బంగారు, 25 గ్రాముల వెండి అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారన్నారు. అయితే ఫిబ్రవరిలో హుండీ లెక్కించగా రూ. 2,17,635 ఆదాయం రాగా, ఇప్పుడు రూ.1,58,738 అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతా లో భద్రపరుస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు దేవిక, సిబ్బంది పాల్గొన్నారు.
నిమజ్జన వేళ విషాదం
● కేసీలో శవమై కనిపించిన వ్యక్తి
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్లో బుధవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో ప్రమాదవశాత్తు కేసీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ టోపి చంద్రశేఖర్(55) గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపు వెంబడి కేసీ కాలువకు చేరుకున్నాడు. కేసీ కాలువ వద్ద సరైన లైటింగ్ లేకపోవడం వలన ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను చీకట్లోనే కేసీ కాలువలోకి నిమజ్జనం చేశారు. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కేసీలోకి పడేసిన వినాయక విగ్రహాలపై తేలియాడుతూ కనిపించిన శవాన్ని భక్తులు కేకలు వేశారు. గణేష్ విగ్రహంపై ఉన్న శవాన్ని బయటకు తీసి చూడగా మృతుడు బోయ టోపి చంద్రశేఖర్గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. విగ్రహాలతో పాటు ప్రమాదవశాత్తు కేసీలో పడి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, బంధువులు అనుమానానం వ్యక్తం చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతంలో ఎలాంటి లైటింగ్ లేదని చీకట్లోనే నిమజ్జన వేడుకలు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుని భార్య హైమావతి ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి ఎస్ఐ నరేంద్ర కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అయితే చంద్రశేఖర్ మృతికి లైటింగ్ కారణం కాదని, ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రమాదవశాత్తు జారి పడ్డాడని ఎస్ఐ రెండు విధాలుగా చెబుతుండటం విశేషం.
గ్రంథాలయాల్లో
పోటీ పరీక్షల పుస్తకాలు
కర్నూలు కల్చరల్: ఉద్యోగార్థులకు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయ శాఖల్లో అందుబాటులో ఉంచుతామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆన్ డిమాండ్ మేరకు తెప్పించిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ను గ్రంథాలయ శాఖల బాధ్యులకు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్తో కలిసి అందజేశారు. చైర్మన్ మాట్లాడుతూ.. పాఠకులు కోరిన వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను తెప్పించామన్నారు. మొదటి విడతలో 30 గ్రంథాలయ శాఖలకు పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. డిప్యూటీ లైబ్రేరియన్ పెద్దక్క, గ్రంథాలయాధికారులు కృష్ణారెడ్డి, గోవింద రెడ్డి, మురళి, కౌసల్య, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.


