అంగన్వాడీల ఉద్యమ బాట
● ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు
● మార్చి 2న విజయవాడ
అలంకార్ సెంటర్లో మహా ధర్నా
కర్నూలు(అర్బన్): సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉద్యమ బాట పట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా, నిర్లక్ష్యం చేయడంపై సోమవారం నుంచి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆయా ప్రాజెక్టుల పరిధుల్లోని ఐసీడీఎస్ కార్యాలయాల ఎదుట దీక్షలను కొనసాగిస్తున్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలను ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగించేందుకు ఆయా సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, ఎలాంటి స్పందన లేకపోవడంతో రిలే దీక్షలకు పిలుపునిచ్చారు. ఉద్యమ కొనసాగింపులో భాగంగా మార్చి 2వ తేదిన విజయవాడలోని అలంకార్ సెంటర్లో మహా ధర్నా చేపట్టేందుకు ఆయా సంఘాల నేతలు సన్నాహాలు ప్రారంభించారు.
ఇవీ డిమాండ్లు..
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, ఆయాలకు రూ.20 వేలు ఇవ్వాలి.
● సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చట్టం అమలు చేయాలి.
● పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి.
లేని పక్షంలో హెల్త్ కార్డులు ఇప్పించాలి.
● పెండింగ్లో ఉన్న మినీ వర్కర్ల అనుభవాన్ని
పరిగణనలోకి తీసుకొని వారిని మెయిన్
వర్కర్లుగా, మెయిన్ సెంటర్లుగా మార్చాలి.
● పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ల
పోస్టులను భర్తీ చేయాలి.
● లబ్ధిదారులకు మెనూ చార్జీలను పెంచి నాణ్యమైన సరుకులను అందించాలి.
● మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలి.
● రకరకాల యాప్లను మెర్జ్ చేసి
పనిభారాన్ని తగ్గించాలి.
● ప్రీ స్కూల్స్ బలోపేతం చేసి, వీరికి తల్లికి
వందనం అమలు చేయాలి.
● ఐదు సంవత్సరాల లోపు పిల్లలను
నిర్భంధంగా అంగన్వాడీ కేంద్రాలకు
పంపే విధంగా చర్యలు తీసుకోవాలి.
● సాయంత్రం పిల్లలకు స్నాక్స్ అందించాలి.


