అమ్ముకోలేరు.. నిల్వ చేసుకోలేరు!
కోవెలకుంట్ల: రబీ సీజన్లో మొదటి పంటగా సాగు చేసిన పప్పుశనగ చేతికందటంతో కోత, నూర్పిడి పనులు దాదాపు పూర్తి అయ్యాయి. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 53,801 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో సంభవించిన మోంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పైర్లలో ఎకరాకు 5 నుంచి 7 క్వింటాళ్లు, తర్వాత సాగు చేసిన పైర్లలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడులు లభించాయి. ఈ ఏడాది పప్పుశనగ సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు ధర వేధిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటారూ. 5 వేల నుంచి రూ. 5,300 వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం క్వింటాకు రూ. 5,850 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులు విక్రయించేందుకు రైతులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. పొలాలు, కలాల్లోని దిగుబడులను ట్రాక్టర్ల ద్వారా నేరుగా గోదాములకు తరలిస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో 80 వేల బస్తాల నుంచి లక్ష బస్తాలు నిల్వ సామర్థ్యం గల దాదాపు 150 గోదాములున్నాయి. ఇప్పటికే ఆయా గోదాములు శనగ బస్తాలతో నిండి పోయాయి. గోదాముల్లో నిల్వ ఉంచుకున్న పంట ఉత్పత్తులకు ఆరు నెలలకు ఒక్కో బస్తాకు రూ. 70 ప్రకారం, ఆరు నెలలు దాటిన తర్వాత ప్రతి నెలా రూ. 10 ప్రకారం బాడుగ చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకంగా వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


