నొస్సంలో దొంగల హల్చల్
సంజామల: దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. పోలీసు చెక్పోస్టు ఉన్న గ్రామంలోనే వరుస చోరీలకు పాల్పడ్డారు. నొస్సం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు ఏడు ఆలయాలు, రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామంలోని వినాయకుడి, సాయిబాబా, గంగమ్మ, పెద్దమ్మ, శివాలయం, పీర్లచావిడి, జమాలయ్య స్వామి దర్గా హుండీలను పగలగొట్టి సొమ్ము అపహరించారు. అంతేకాకుండా అదే గ్రామంలో ప్రధాన రహదారిపై ఉన్న అబ్దుల్ షుకూర్ దుకాణం, మజూద్ హోటల్ చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీల్లో దాదాపు రూ. లక్ష నగదు, బియ్యం బస్తాలు అపహరించారు. నెల క్రితం మండలంలో విద్యుత్ తీగల చోరీలతో రైతులు బెంబేలెత్తారు. ప్రస్తుతం ఆలయాల్లో చోరీ జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.


