నమో.. నారసింహా!
● శ్రీ జ్వాలా నరసింహుడి బ్రహ్మోత్సవాలకు
అంకురార్పణ
● శాస్త్రోక్తంగా అంకుర హోమం
ఆళ్లగడ్డ: అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శనివారం రాత్రి అంకుర్పారణ పూజలు చేశారు. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహా దేశికన్ పర్యవేక్షణలో పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడికి పూలమాలలు వేసి, తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షుకుడిగా విష్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న పుట్టకు పూజలు నిర్వహించి పుట్టమన్నును సేకరించి మండపం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ అంకుర హోమం నిర్వహించి సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలను పోసి సోమకుంభ స్థాపన చేశారు. ప్రధానార్చకుడు వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్, సీఏఓ రామానుజన్ పాల్గొన్నారు.
నేడు ధ్వజారోహణం
బ్రహ్మోత్సోవాల్లో భాగంగా ఆదివారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భేరీపూజ కొనసాగుతుంది. మధ్యాహ్నం అభిషేకం, రాత్రి స్వామి సింహవాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నేడు దిగువ అహోబిలంలో..
దిగువ అహోబలంలో బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం రాత్రి పండితుల ఆధ్వర్యంలో అంకుర్పారణ పూజలు నిర్వహించనున్నారు. అనంతరం బ్రహ్మోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు
నమో.. నారసింహా!


