సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యం
● కేసీ కెనాల్ వద్ద రైతుల ఆందోళన
నందికొట్కూరు: సకాలంలో పంటలకు సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మల్యాల గ్రామం వద్ద ఎండిపోయిన కేసీ కెనాల్ వద్ద రైతులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు షరీఫ్, మధు, శివన్న, షాలు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. ఈ ఏడాది కేసీ కెనాల్ కింద మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలు సాగుచేశామన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ఈ నెల 12న కేసీ కెనాల్కు నీటిని బంద్ చేశారన్నారు. సాగునీరు మరో రెండు రోజుల్లో అందకపోతే పంటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయాలని కోరారు. మొక్కజొన్న కంకులు పాలు పడుతున్న సమయంలో సాగునీరు అందకపోతే ఎండిపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు.


