‘అలవి’గాని అక్రమాలు!
చర్యలు తీసుకోలేదు
● అలవి వలలతో చేపల వేట ● అధికారులతో కుమ్మకై న వేటగాళ్లు ● పట్టించుకోని మత్స్యశాఖ అధికారులు
నందికొట్కూరు: కృష్ణానదిలో అలవి వలలతో చేపల వేట చేస్తున్నారు. ఈ వలలో చేపపిల్లలు పడి చనిపోతున్నాయి. అయినా మత్స్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు నెలల క్రితం 63 లక్షల చేప పిల్లలను కృష్ణానదిలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, మత్స్యశాఖ జిల్లా అధికారులు వదిలేశారు. ఇవి వృద్ధి చెందకుండా కొందరు అలవి వలలతో చేపల వేట చేస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రవహించే కృష్ణానది తీరంలో చేప పిల్లలను వదిలిన రెండు నెలలు గడవక ముందే వాటిని చంపేస్తూ రూ. కోట్ల ఆదాయం పొందుతున్నారు. టీడీపీ నాయకులకు, అధికారులకు వాటాలు ప్రతి నెలా అందుతునట్లు విశ్వసనీయ సమాచారం. చేపలు పట్టేందుకు వైజాక్, కాకినాడ ప్రాంతాల నుంచి వ్యాపారులు అడ్వాన్స్లు ఇచ్చి తీసుకొస్తారు. సెప్టంబర్ నుంచి మార్చి నెల వరకు కృష్ణానదిలో వేట సాగిస్తారు. వ్యాపారులు మేసీ్త్రకి నెలకు రూ. 12 వేలు, మిగతా చేపలు పట్టే వారికి నెలకు రూ. 10 వేలు ఇస్తారు. వ్యాపారులు అలవి వలలతో చేపలు పడుతుంటే మత్స్యశాఖ అధికారులు స్పందించడం లేపదు. కృష్ణానది చేపలకు భలే గిరాకీ ఉండేది. వీటిని కర్నూలు నుంచి రైల్లో తరలిస్తున్నారు. ఎండు చేపలను కలకత్తాకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
అలవి వలలతో వేటగాళ్లు చిరు చేపలను చంపేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విచారణ జరిపి మత్స్యశాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అలవి వలలతో చేపల పట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోకపోతే దీక్షకు కూర్చొంటా.
– జనార్దన్గౌడ్, శాతనకోట,
నందికొట్కూరు మండలం
‘అలవి’గాని అక్రమాలు!


