తిమ్మాపురంలో మహిళ ఆత్మహత్య
నందికొట్కూరు: మిడుతూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో గురువారం ఉదయం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ఓబులేసు తెలిపిన వివరాల మేరకు.. మూడేళ్ల క్రితం గడివేముల మండలం బూజనూరు గ్రామానికి కరిష్మాకు(20) మిడుతూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మొల్ల షఫివుల్లాతో వివాహమైంది. ఓపెన్ డిగ్రీ మూడోవ సంవత్సరం చదువుతున్న కరిష్మా ఈ నెల 21వ తేదీన పరీక్షలు ఉండటంతో నందికొట్కూరులో హాల్టికెట్ తెచ్చుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సున్నిపెంటలో సీసీ కెమెరాల మెకానిక్ పని చేస్తున్న భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. రేపు వెళ్దామని చెప్పంతో ఆమె మనస్తాపానికి గురైంది. వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి ‘నేను చనిపోతున్నా.. నా కూతుర్ని బాగా చూసుకో’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అతను తిరిగి ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో వెంటనే సమీపంలోని బంధువులకు విషయం చెప్పాడు. వారు వెళ్లి చూసేపోలే కరిష్మా ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా కరిష్మా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిరాలికి 14 నెలల పాప ఉంది. మృతురాలి తల్లి రమిజాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
కౌతాళం: కౌతాళం పోలీస్టేషన్ పరిధిలోని కామవరం గ్రామానికి చెందిన వడ్డే కోటేశ్వరి గురువారం తుంగభద్ర దిగువ కాలువలో శవమై తేలింది. సీఐ అశోక్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. కామవరం గ్రామానికి చెందిన వడ్డే వెంకటరాముడు, ఈరమ్మల దంపతుల కుమారుడు వడ్డే వీరేష్కు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పులకల్ గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి కూతురు వడ్డే కోటేశ్వరి (21)తో వివాహమౌంది. ఏమి జరిగిందో తెలియదుకానీ తమ కూతురు కనిపించడం లేదని బుధవారం మద్దిలేటి కౌతాళం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తుండగా గురువారం పెద్దతుంబళం గ్రామం వద్ద తుంగభద్ర కాలువలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు బయటకు తీశారు. మృతి చెందిన మహిళ కోటేశ్వరిగా తండ్రి మద్దిలేటి గుర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
23 నుంచి రగ్బీ పోటీలు
కర్నూలు (టౌన్): నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా ప్రాంగణంలో ఈనెల 23, 24 తేదీల్లో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రగ్బీ అండర్– 19 చాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 కార్యదర్శి రాఘవేంద్ర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
సమస్యల పరిష్కారం కోసం జీపు జాతా
కర్నూలు(సెంట్రల్): కర్నూలు మండలంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 23, 24 తేదీల్లో జీపు జాతా చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.రామకృష్ణ తెలిపారు. గురువారం కార్మిక, కర్షక భవన్లో సీపీఎం మండల కమిటీ సమావేశం డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కర్నూలు మండలం జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్నా సమస్యలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయన్నారు. రైల్వే వ్యాగన్ వర్కుషాపు పూర్తి చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గ్రామాలకు రోడ్లు నిర్మించాలని కోరారు. అలాగే తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. నాయకులు బాలపీర, శ్రీరాములు, నరసింహులు, బీసన్న పాల్గొన్నారు.
తలసీమియా బాధితుల కోసం రక్తదానం
కర్నూలు(హాస్పిటల్): సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు, మోక్షజ్ఞ ఆర్గనైజేషన్ కర్నూలు ఆధ్వర్యంలో తలసీమియా బాధిత చిన్నారుల కోసం గురువారం కర్నూలులోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ ప్రారంభించి ఆయన కూడా రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసీమియా బాధిత చిన్నారుల కోసం చేసే ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. అలాగే యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. రక్తదానం ఆవశ్యకత, తలసీమియా వ్యాధి గురించి రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి వివరించారు.


