
నేటి నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్
నంద్యాల(న్యూటౌన్): పాలిసెట్లో అర్హత పొందిన విద్యార్థులకు ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ పేర్కొన్నారు. కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలిసెట్ ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్కు హాజరుకావాలన్నారు. హాల్టికెట్, ర్యాంకు కార్డు, పది మార్క్లిస్ట్, 4 నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, టీసీ, ఇన్కం, మైనార్టీ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. ఇచ్చిన ఆప్షన్లు జూలై 01 తేదీన మార్చుకోవచ్చన్నారు. అభ్యర్థులకు సీట్ అలాట్మెంట్ 3వ తేదీ ప్రకటిస్తారన్నారు. మరింత సమాచారం కోసం 9912377723 నంబరును సంప్రదించాలన్నారు.
ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదల
నంద్యాల(న్యూటౌన్): జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను గతేడాది డిసెంబర్ 8వ తేదీన నిర్వహించినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల మెరిట్కార్డును ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు వెంటనే బ్యాంక్ ఖాతా తెరిచి ఆధార్ను లింక్ చేయించుకొని డీబీటీ ద్వారా డబ్బులు జమ అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
బొమ్మలసత్రం: నేరాల కట్టడికి గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ అధిరాజ్సింగ్రాణా తెలిపారు. ప్యాపిలిలో కోడి పందేలు నిర్వహిస్తున్నా గుర్తించి నలుగురిపై కేసు నమోదు చేశామని, వారి నుంచి రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 116 మందిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. మద్యం విక్రయించే వారి నుంచి 94 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎంవీ యాక్ట్ నిభంధనలు పాటించిన 469 మందికి రూ. 2,99,810 జరిమానా విధించామని పేర్కొ న్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన 116 మందిపై కేసు నమోదు చేశామన్నారు.
సున్నిపెంట శివారులో చిరుత కలకలం
శ్రీశైలం ప్రాజెక్ట్: సున్నిపెంట గ్రామ శివారులోని శ్రీ నీలంపాటి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం చిరుత కలకలం రేపింది. ఆలయం వద్ద కొండముచ్చు కనిపించడంతో అటవీప్రాంతం నుంచి వేగంగా వచ్చిన పులి దాన్ని లాక్కెళ్లినట్లు ఆ ప్రాంతంలో అటవీ ఫలాలు అమ్ముకునే వాళ్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు మదన్, ఠాగూర్ తదితరులు ఆ ప్రాంతానికి చేరుకొని గాలించారు. డ్రోన్ను సైతం వినియోగించినా చిరుత జాడా తెలియరాలేదని సమాచారం.