
దేశంలోనే 5వ స్థానం
28 దఫాలుగా పురుగు మందుల పిచికారీ
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలోనే అత్యధికంగా మిర్చి ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. పురుగు మందుల వినియోగం అధికమవడంతో రైతులకు పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతోంది. ఇదే సమయంలో మిర్చిలో పురుగు మందుల అవశేషాల కారణంగా ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇకపోతే ఈ కారణంగానే ఎగుమతులు కూడా పడిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల గుంటూరు నుంచి వ్యాపారులు 60 కంటైనర్లలో 900 టన్నుల మిర్చి చైనాకు ఎగుమతి చేశారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో మిర్చిలో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వెనక్కు తీసుకెళ్లాలని చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన మిర్చి ప్రధానంగా గుంటూరు యార్డుకు తరలుతోంది. ధర లేకపోవడంతో 80 శాతం పంటను అక్కడి ఏసీ గోదాముల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో మిర్చి సాగు బాగా కలిసొచ్చింది. 2022–23లో ఉమ్మడి జిల్లాలో 1,29,575 ఎకరాల్లో మిర్చి సాగయింది. ఆ ఏడాది ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. బ్యాడిగ రకాలకు క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.56 వేల వరకు ధర పలికింది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 1,17,868 ఎకరాల్లో మిర్చి సాగయింది. సాగు తగ్గినప్పటికీ చీడపీడలు, వైరస్ తెగుళ్లు, నల్లతామర ప్రభావం తీవ్రంగా ఉండటంతో పురుగుమందుల వినియోగం భారీగా పెరిగింది.
20–25 దఫాలుగా
పురుగుమందుల వినియోగం
మిర్చి పంట నాట్లు మొదలుకొని చివరి కోత వరకు ఆరు నెలలు ఉంటుంది. ఈ మధ్య కాలంలో 20 నుంచి 25 దఫాలుగా పురుగుమందులు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మంత్రాలయం, పెద్దకడుబూరు, గోనెగండ్ల, కోడుమూరు, దేవనకొండ, హొళగుంద, ఆదోని, సి.బెళగల్, ఓర్వకల్, ఆలూరు, కౌతాళం, కోసిగి మండలాలు.. నంద్యాల జిల్లాలో రుద్రవరం, శిరువెళ్ల, ప్యాపిలి, అవుకు, ఆళ్లగడ్డ, నందికొట్కూరు తదితర మండలాల్లో మిర్చి సాగవుతోంది. ఒక్కో దఫా పురుగు మందులు పిచికారీ చేయాలంటే ఎకరాకు రూ.3వేల పైనే ఖర్చు అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఎకరాకు కేవలం పురుగు మందులపైనే రూ.54 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తుండటం గమనార్హం.
డీలర్ల ఇష్టారాజ్యం
మిర్చి రైతులు పురుగుల నియంత్రణకు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. డీలర్లు అమ్మకాలను పెంచుకునేందుకు రెడ్, ఎల్లో లేబుల్ పురుగుమందులనే అధికంగా అంటగడుతున్నట్లు తెలుస్తొంది. గ్రీన్ లేబుల్ పురుగుమందులు వినియోగించేలా డీలర్లు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ ఆ దిశగా ప్రోత్సహించకపోవడం వల్లే పురుగుమందుల వినియోగం పెరిగిపోతోంది. మిర్చి సహా అన్ని పంటల్లో గ్రీన్ లేబుల్ పురుగుమందులను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడుకునే వీలుంటుంది. అయితే గ్రీన్ లేబుల్ పురుగుమందుల వినియోగం అతి తక్కువగా అంటే 10–20 శాతం ఉండగా.. రెడ్, ఎల్లో, బ్లూ లేబుల్ పురుగుమందుల వినియోగం 80–90 శాతం వరకు ఉంటోంది.
సేంద్రియ ఎరువులతోనే
పంటల్లో నాణ్యత
రసాయన ఎరువులు మితిమీరి వినియోగిస్తుండటంతో తెగుళ్లు, పురుగుల బెడద పెరుగుతోంది. సేంద్రియ ఎరువులు వినియోగిస్తే తెగుళ్లు, పురుగుల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు పురుగుమందుల వాడకం కూడా తగ్గించుకోవచ్చు. పురుగుమందులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వినియోగించాలి. గ్రీన్ లేబుల్ పురుగుమందులను సిఫారసులకు లోబడి వినియోగిస్తే మిర్చిలో నాణ్యత కూడా పెరుగుతుంది.
– సుజాతమ్మ, ప్రదాన శాస్త్రవేత్త,
ఏరువాక కేంద్రం, కర్నూలు
మిర్చి తోటలో పురుగుమందు పిచికారీ చేస్తున్న రైతు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2023–24తో పోలిస్తే.. 2024–25లో పురుగుమందుల వినియోగం భారీగా పెరిగింది. 2023–24లో 2.92 లక్షల లీటర్ల పురుగుమందులు వినియోగించినట్లు తెలుస్తోంది. 2024–25లో ఏకంగా 3,61,355 లీటర్ల పురుగుమందులు వినియోగించడం గమనార్హం. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంలో నంద్యాల జిల్లా దేశంలోనే 5వ స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పెద్దకడుబూరు మండలం బసలదొడ్డి గ్రామం మిర్చి సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ మిర్చి సాగుకు మల్చింగ్ కూడా వినియోగిస్తారు. ఈ గ్రామానికి చెందిన ఒక రైతు గత ఏడాది 4 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే నల్ల తామర తీవ్రత పెరిగిపోవడం, పంటకు నష్టం తీవ్రత ఎక్కువగా ఉండటంతో నాలుగు రోజులకోసారి పురుగు మందులు పిచికారీ చేశారు. ఒక సీజన్లోనే 28 దఫాలు పురుగు మందులు పిచికారీ చేయడం గమనార్హం. ఇందుకోసం ఎకరాకు రూ.60 వేల వరకు ఖర్చు చేశారు.

దేశంలోనే 5వ స్థానం