
విధేయుడా వందనం!
ఆత్మకూరురూరల్: నేటి సమాజంలో నీతి మంత రాజకీయాలు చేసేవారు అరుదుగా కనిపిస్తారు. రాజకీయ ఎదుగదల కాక్షించో.. పదవులు, డబ్బు కోసమో తెలియదు కానీ.. కొందరు నేతలు పొద్దున ఒక పార్టీలో ఉండి సాయంత్రం మరో పార్టీ వేదికపై కనిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ నిరుపేద గిరిజనుడు డబ్బుకు లొంగలేదు. తనను గెలిపించిన ప్రజల వెంటే ఉంటానని ఆఫర్ను తిరస్కరించాడు. అతనే వైఎస్సార్సీపీ నాయకుడు, కురుకుంద గ్రామ మాజీ సర్పంచ్ ఆర్థి కొండన్న(58). నీతివంతమైన రాజకీయాలకు చిరునామాగా నిలిచిన ఆయన శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు, పలువురు ఆయన రాజకీయ విలువల గురించి చర్చించుకోవడం కనిపించింది. 2014 ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ టికెట్పై గెలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి కొద్ది రోజుల్లోనే టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కురుకుంద సర్పంచ్గా ఉన్న చెంచు కొండన్నను కూడా టీడీపీలోకి ఆహ్వానించారు. గ్రామంలో టీడీపీ నాయకులకు అనుకూలంగా నడుచుకోమని చెప్పారు. అయితే చెంచు కొండన్న అందుకు నిరాకరిస్తూ తనకు ఓట్లు వేసి గెలిపించింది వైఎస్సార్సీపీ అభిమానులని, తాను ఆ పార్టీకి ద్రోహం చేయనని టీడీపీ నేతలకు తేల్చి చెప్పాడు. అలాగే ఎన్నికల ముందు కూడా టీడీపీకి చెందిన నాయకులు తనను పార్టీలోకి ఆహ్వానించినప్పుడు కూడా పొలాలకు కాపలా ఉండి జీవనం సాగించే కొండన్న ఎలాంటి ప్రలోభాలకు లొంగని అంశాన్ని గ్రామస్తులు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం కనిపించింది. ఊరిలో ఇల్లు, అడవిలో చేను లేని ఆహార సేకరణ దశలోనే చెంచు జీవనం సాగించే గిరిజనుడు ఆనాడు ప్రలోభాలకు లొంగని విషయం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమేనని చెప్పవచ్చు. చిన్న స్థాయిలోనైనా విలువలకు కట్టుబడిన గిరిజన కొండన్నకు గ్రామస్తులు నీరాజనాలు అర్పించారు. కొండన్నకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు.
కురుకుంద మాజీ సర్పంచ్
అర్తి కొండన్న మృతి
రాజకీయాల్లో విలువలు చాటిన
నిరుపేద గిరిజనుడు