
వసతి మూత‘బడి’
ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. పేద విద్యార్థులకు వసతి గృహాలు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కాగా ఆలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ బీసీ బాలురు వసతి గృహం ఇంత వరకు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇక్కడ ఉండలేక ఇంటి బాట పట్టారు. సొంత భవనం లేకపోవడంతో ఆలూరు సమీపంలోని ఎల్లార్తి రోడ్డు వద్ద ప్రగతి జూనియర్ కళాశాల, పాఠశాల ఆవరణలోనే గత ఏడాది నుంచి సాంఘిక సంక్షేమ శాఖ బీసీ బాలురు వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ బాలుర వసతి గృహంలో 120 మంది, కళాశాల వసతి గృహంలో 110 మంది ఉంటున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హెచ్డబ్ల్యూఓ సంపత్కుమార్ను ఈనెల 10న కర్నూలుకు బదిలీ చేశారు. ఆదోని డివిజన్ ఏఎస్డబ్యూఓగా విధులు నిర్వహిస్తున్న రాజా కుళ్లాయప్ప ఈనెల 1న పదవీ విరమణ పొందారు. ఆదోని, ఆలూరు సబ్డివిజన్ పరిధిలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఏఎస్డబ్ల్యూఓగా పత్తికొండలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులకు ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు. ఆలూరు బీసీ బాలుర వసతి సంక్షేమ కళాశాల వసతి గృహానికి అనిమిరెడ్డిని హెచ్డబ్ల్యూఓగా అధికారులు నియమించారు. అయితే ఆరోగ్య కారణాలతో ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు. వసతి గృహాల తలుపులకు మూతపడి ఆదివారం నాటికి 22 రోజులకు చేరుతుంది. వసతి గృహం తెరవకపోవడంతో విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ఒక ఫైల్ కూడా పంపామని ఏఎస్డబ్ల్యూఓ శ్రీనివాసులు తెలిపారు.
తలుపులు తెరుచుకోని బీసీ బాలుర వసతి గృహం
ఇంటి బాట పట్టిన విద్యార్థులు

వసతి మూత‘బడి’