
నేర నిరూపణతోనే బాధితులకు న్యాయం
బొమ్మలసత్రం: ప్రతి కేసును చిత్తశుద్ధితో దర్యాప్తు చేసి నేర నిరూపణకు సమర్ధవంతంతగా పనిచేసి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా పోలీసు అధికారులకు సూచించారు. శనివారం స్ధానిక ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, నేరగణాంకాల సేకరణ విశ్లేషణ, నిర్వహణ సంస్థ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ముద్దాయిలను అరెస్ట్ చేయడం, చార్జిషీట్ వేయడంతో పాటు కోర్టు విధివిధానాలు సరిగా పాటించి కేసు నిరూపణ చేయాల్సిన బాధ్యత కోర్టు కానిస్టేబుళ్లదేనన్నారు. నాన్బెయిలబుల్ వారెంట్లు, పాత పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కేసుల దర్యాప్తులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన వారికి రివార్డులు, చట్టాన్ని అతిక్రమించే వారికి క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.