
ధర ‘ఎగ్’బారుతోంది!
● వంద కోడిగుడ్ల ధర హోల్సేల్లో రూ.600 పైమాటే
గోస్పాడు: కోడి గుడ్డు ధరలు ఎగబాకుతున్నాయి. వాటిని సామాన్యులు కొనుగోలు చేయలేకపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఒకలా ఉంటే మారుమూల గ్రామాల్లో ధరలు అధికంగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నుంచి ధరలు పెరుగుతూ ఉన్నాయి. జనవరిలో 30 గుడ్ల ధర రూ. 120 నుంచి రూ. 130 వరకు ఉంది. నిలకడ లేకుండా ప్రతిరోజు 5 పైసల నుంచి 15 పైసల వరకు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం వంద గుడ్లు రూ. 600 నుంచి రూ.625 పలుకుతున్నాయి.
ఇదీ దుస్థితి..
జిల్లాకు హైదరాబాద్, మహబూబ్నగర్, ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను, గుడ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పట్టణాల్లో వ్యాపారులు ఒక్కొక్క గడ్డు రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఒక్కొక్క గుడ్డు ధర రూ.8వరకు పలుకుతోంది.