
ఓట్లు అడిగినప్పుడు దళితులని తెలియదా?
ఆదోని టౌన్: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగిన కూటమి నేతలకు అప్పుడు దళితులనే విషయం తెలియలేదా అని దళిత, గిరిజన ఐక్యవేదిక హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక(జేఏసీ) నాయకులు ప్రశ్నించారు. ఢణాపురం సర్పంచ్ చంద్రశేఖర్ను కులం పేరుతో అవమానించిన ఎమ్మెల్యే బి.పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు, అక్కడి నుంచి తిరిగి భీమాస్ సర్కిల్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు అజయ్బాబు, వీరేష్, దేవదాస్, వై.పి.గంగాధర్, కల్లుబావి నాగేంద్ర, ప్రసాద్, మహిళా నాయకురాళ్లు శ్రీలక్ష్మి, సుజ్ఞానమ్మ తదితరులు మాట్లాడారు. గ్రామ ప్రథమ పౌరుడిని జనం మధ్యలో కులం పేరుతో అవమానించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒకరు క్రిష్టియనా అంటే, మరొకరు ఎస్సీ అని నోరు పారేసుకోవడంతో దళిత సమాజాన్ని అగౌరవపరచడమేనన్నారు. ఓట్ల కోసం దళితుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి కులం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బాధిత సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కులాన్ని ఎత్తి చూపడంతో తాను వేదికపైకి వెళ్లలేకపోయానన్నారు. వందలాది మంది సమక్షంలో తనను కులం పేరుతో అవమానం చేసిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు, ఇస్వీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు అందజేశారు. ఎమ్మెల్యే బి.పార్థసారధి, టీడీపీ మహిళా నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఐక్య వేదిక నాయకులు, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
దళిత సర్పంచ్కు అవమానంపై
ఆదోనిలో భారీ నిరసన ప్రదర్శన

ఓట్లు అడిగినప్పుడు దళితులని తెలియదా?