మిర్యాలగూడ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలపై నేటి నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని, సాగర్లో సాగుకు సరిపడా నీరు ఉన్నప్పటికీ నీటి విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేసిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలంగాణాకు దక్కాల్సిన నీటిని ఆంధ్రాకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా, సాగర్ నుంచి కుడి కాలువకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలతో పాటు 420 హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానూభూతి పరులు, రైతులు మహిళలు పెద్ద ఎత్తున హజరు కావాలన్నారు. ఈ నెల 3వ తేదీన చేపట్టే రైతు సదస్సుకు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతున్నారని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చింతిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, యడవల్లి శ్రీనివాస్రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, అన్నబీమోజు నాగార్జునాచారి, ధనావత్ చిట్టిబాబునాయక్, ధనావత్ బాలాజీనాయక్, కుందూరు వీరకోటిరెడ్డి, కుర్ర సేవ్యానాయక్, చౌగాని బిక్షం గౌడ్, అమరావతి సైదులు, పాశం నర్సింహారెడ్డి, కొత్త మర్రెడ్డి, రమణ, సందేశీ అంజన్రాజు, రవీందర్నాయక్, ఎండి షోయబ్, నాగరాజు, వెంకన్న, గోపి, శివతో పాటు పలువురు నాయకులు తదితరులున్నారు.
ఫ నేటి నుంచి 8వ తేదీ వరకు కార్యక్రమాలు
ఫ 3న రైతు సదస్సుకు కేటీఆర్ రాక
ఫ మాజీ మంత్రి జగదీష్రెడ్డి వెల్లడి


