నల్లగొండ టూటౌన్ : పట్టణంలోని ఐస్ తయారీ యూనిట్లను జిల్లా ఆహార భద్రత అధికారి ఎన్.శివశంకర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూనిట్లలో పరిశుభ్రత, శానిటరీ, ఆహార భద్రత ప్రమాణాలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఐస్ను నేరుగా ఆహార పదార్థంగా ఉపయోగించకపోయినా, చేపలు, పండ్లు, మాంసం వంటి ఆహార పదార్థాలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉంటుందని, ఆహార భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రకాశం బజార్లోని ఒక చికెన్ సెంటర్ నుంచి ఒక ఫంక్షన్ హాల్కు ఎలాంటి పత్రాలు లేకుండా ఆటోలో తరలిస్తున్న సుమారు 200 కిలోల చికెన్ను అధికారులు తనిఖీ చేసి నిర్వాహకులకు అవగాహన కల్పించి వదిలివేశారు.


