నల్లగొండ : జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జంతు హింస నివారణ సంఘం జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జంతువుల రవాణా విషయంలో నిబంధనలు పాటించాలని, ఒకే వాహనంలో అధిక సంఖ్యలో జంతువులను తరలించవద్దని చెప్పారు. పశు వైద్యాధికారి సర్టిఫికెట్ లేకుండా జంతువులను తరలించడం నేరమన్నారు. రవాణా వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఉండాలని, ట్రాన్స్పోర్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల్లో జంతువులకు ఆశ్రయం కల్పించే విధంగా షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని సూచించారు. వీధి కుక్కల నియంత్రణ కోసం త్వరలో కుక్కల దత్తత కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, పశు సంవర్ధక అధికారి డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


