
‘భూ భారతి’తో రైతులకు మేలు
బోర్డుపై రాస్తూ.. సందేహాల నివృత్తి
ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఏళ్ల తరబడి వారి పేరున ఉండి సాగు చేసుకుంటున్న వారి వారసుల పేరున మార్పిడి జరగక హక్కులు ఉండటం లేదని గుర్రంపోడుకు చెందిన వనమాల కామేశ్వర్ అనే రైతు కలెక్టర్ దృష్టి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన బోర్డుపై వివరాలు రాస్తూ.. రైతులకు అర్థమయ్యేలా వివరించారు. ప్రభుత్వం పేదలకు అందించే అసైన్డ్ భూమి ఉదాహరణకు 1971 నుంచి కామేశ్వర్ పేరున ఉంటే ఆయన బతికి ఉన్నంతకాలం ఆయన పేరునే ఉండాలి. కానీ 2016లో మరొకరి పేరు (ఇలా అని తన పేరును బోర్డుపై రాశారు) పైకి మారిందనుకుందాం. కానీ.. అలా మారడానికి వీల్లేదు. అసైన్డ్ భూమి హక్కుదారుడు చనిపోతేనే వారి వారసులకు బదలాయింపు జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రుల పేరున భూమి ఉంటేనే కుమారులు బాగా చూసుకుంటారని బతికి ఉన్నంత కాలం వారసులకు పేరు మీదికి మార్పిడి జరగకుండా అసైన్డ్ చట్టంలో పొందుపర్చారని కలెక్టర్ వివరించారు.
గుర్రంపోడు : భూ భారతి చట్టంతో రైతులకు మేలు కలుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతులకు భూ భారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డితో కలిసి మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ధరణిలో లేని వెసులుబాట్లు భూ భారతిలో ఉన్నాయని, ఇప్పుడు తప్పు జరిగిన చోటనే సవరించే అధికారం వల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. భూ భారతిలో పట్టాదారు పూర్తి వివరాలతోపాటు ఆ భూమి నక్షా కూడా ఉండటం వల్ల భూమికి భద్రత ఉంటుందని, సరిహద్దు సమస్యలు ఉండవని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామ పాలన అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
గ్రామగ్రామాన అవగాహన సదస్సులు
ప్రభుత్వం ప్రతి గ్రామంలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించే అవకాశం ఉందని ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. సాగులో ఉన్న ప్రతి ఉన్న రైతుకు భూమిపై హక్కు కల్పించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, తహసీల్దార్ ఫరీదుద్దీన్, ఎంపీడీఓ మంజుల తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి