ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరం సైతం అరకొర సౌకర్యాల మధ్యే ప్రారంభమైంది. పలుచోట్ల తొలిరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆదరాబాదరగా వచ్చి పాఠశాలలను తెరిచారు. పాఠశాలలకు అక్కడక్కడ పదుల సంఖ్యలో విద్యార్థులు వచ్చారు. కొన్నిచోట్ల విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్యనే అధికంగా కనిపించింది. ఈ క్రమంలో అచ్చంపేట మండలంలోని చౌటపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల మూడు గదులు కూలిపోయాయి. దీంతో మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే జిల్లావ్యాప్తంగా చాలా పాఠశాలలు శిథిల గదుల్లోనే కొనసాగుతుండగా.. మూత్రశాలలు, మరుగుదొడ్లు సైతం మరమ్మతులకు నోచుకోక అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. మరికొన్నిచోట్ల అసంపూర్తి గదులు, అరకొర నిర్మాణాలే విద్యార్థులకు దర్శనమిచ్చాయి.


