అచ్చంపేట రూరల్: చేతివృత్తుల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని హస్తకళల డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల అన్నారు. గురువారం పట్టణంలోని శాలివాహన భవనంలో జిల్లాలోని వెదురు ద్వారా వస్తువులు తయారు చేస్తున్న హస్త కళాకారులకు మాతృభూమి సంస్థ ఆధ్వర్యంలో పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సువర్చల, ఏపీపీసీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయసాగర్రెడ్డి మాట్లాడారు. మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్, హస్తకళల డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సమాజంలో ప్రకృతి సిద్ధంగా లభించే చెట్లు, మట్టి, రాళ్లు, లోహాలు, ధారాలతో హస్తకళల ద్వారా వస్తువులు తయారు చేసేవారిని ప్రోత్సహించి, తయారు చేసిన వస్తువులు మార్కెట్లో అమ్ముకుని వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. భారత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారిని ఆర్థిక స్వావలంబన వైపు వెళ్లే విధంగా హస్తకళలో శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో 50 మంది వెదురు హస్త కళాకారులకు సుమారు రూ.5 లక్షల విలువైన 13 రకాల పరికరాలను అందజేశామన్నారు. వీటిని హస్త కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హస్త కళాకారులు చేసినటువంటి వస్తువులను ప్రభుత్వమే ఎగ్జిబిషన్ల ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేసి వారికి ప్రయాణ ఖర్చులతోపాటు, ప్రతిరోజు భోజన ఖర్చులు, వసతి సదుపాయం కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో హస్తకళల కళాకారులకు శిక్షణ శిబిరాలు, స్టడీ టూర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో హస్త కళాకారుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకునే విధంగా సహకరిస్తామన్నారు.


