బల్మూర్: మండలంలోని మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేయాలని బల్మూర్, మైలారం గ్రామాల రైతులు ముక్తకంఠంతో నినదించారు. మంగళవారం పర్యావరణశాఖ ఆధ్వర్యంలో మైనింగ్ ప్రదేశంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. అదనపు కలెక్టర్ అమరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు ప్రజాభిప్రాయ సేకరణ సభలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్వే నంబర్ 2220లోని 7.737 హెక్టార్లలో మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని.. గతంలో మైనింగ్ తవ్వకాలను వ్యతిరేకిస్తే కేసులు పెట్టారని ఆందోళన వ్యక్తంచేశారు. మళ్లీ మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమపై ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా మైనింగ్ అనుమతులను రద్దుచేసే వరకు తమ పోరాటం ఆగదని సర్పంచులు శిరీష, సరితతో పాటు ఆయా గ్రామాల రైతులు తేల్చిచెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, రైతుల అభిప్రాయాలను రికార్డు చేయడం జరిగిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. సమావేశంలో మైనింగ్శాఖ అధికారి సురేశ్బాబు ఉన్నారు.
ముక్తకంఠంతో నినదించిన బల్మూర్, మైలారం గ్రామాల రైతులు
అదనపు కలెక్టర్ సమక్షంలోప్రజాభిప్రాయ సేకరణ


