పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పాటు వ్యవసాయ పనులు ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి మైసమ్మను దర్శించుకున్నారు. అప్పటికే జాతర మైదానంలో సిద్ధంచేసిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో జాతర మైదానం కిక్కిరిసిపోయింది. కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు 15వేల మంది భక్తులు మైసమ్మను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారి రామేశ్వరశర్మ తెలిపారు.
సీపీఐ పోరాటంతోనేపనిగంటల తగ్గింపు
పెద్దకొత్తపల్లి: సీపీఐ పోరాట ఫలితంగానే ప్రభుత్వం కార్మికులకు పనిగంటలను తగ్గించిందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పెద్దకొత్తపల్లి మండలం నక్కపల్లిలో సీపీఐ పార్టీ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. అదే విధంగా వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సుదర్శన్రెడ్డి, శ్రీనివాసులు, మల్లయ్య, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
‘పాలమూరు’కు
జాతీయ హోదా ఇవ్వాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్ట్కు జాతీయ హోదా సాధనకు ఎంపీ డీకే అరుణ కృషి చేయాలని సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి పరమేశ్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మే 10న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్నారని, పాలమూరుకు జాతీయ హోదా ప్రకటన చేయించాలని కోరారు. 2014లో ఎన్నికల ముందు పాలమూరు సాక్షిగా ఆనాటి సుష్మాస్వరాజ్ బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరుకు జాతీయ హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను గుర్తు చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినా పాలమూరుకు ఇవ్వాల్సిన జాయతీ హోదాను మరిచిపోందని విమర్శించారు. జాతీయ హోదా కల్పించకుండా బీజేపీ తెలంగాన ప్రజలను మోసం చేసిందని తెలిపారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించిన పాలమూరుకు మాత్రమే జాతీయ హోదా రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకత్వం చొరవ చూపడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. కృష్ణ బేసిన్లో పాలమూరు క్యాచ్మెంట్ ఏరియా 70శాతం ఉన్న పాలమూరుకు దక్కాల్సిన నీళ్ల వాట దక్కడంలేదని ఆరోపించారు. ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని నోటితో పాలమూరుకు జాతీయ హోదాను ప్రకటించేలా ఇక్కడి బీజేపీ నాయకులు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్నగర్ క్రీడలు: వరంగల్లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు.
బస్సును ఢీకొన్న కారు
● ఇద్దరి దుర్మరణం
● హెదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం


