భానుడి విలయతాండవం | - | Sakshi
Sakshi News home page

భానుడి విలయతాండవం

May 1 2026 8:20 AM | Updated on May 1 2026 8:20 AM

ఏటా పెరుగుదల.. గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలి నీరు ఎక్కువ తాగాలి

ఇవీ వడదెబ్బ లక్షణాలు

శరీర నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది.

విపరీతమైన దాహం వేయడంతోపాటు శరీరం వేడెక్కుతుంది.

తలనొప్పి, కళ్లు తిరగడం, తూలడం, వాంతులు, కాళ్లు, కండరాలు పట్టేసి నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

జాగ్రత్తలుఇలా..

వడదెబ్బ లక్షణాలున్న బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి.

చల్లని నీరు ముఖంపై చిలకరించాలి

కూలర్‌ లేదా ఏసీల వద్ద విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేయాలి.

చల్లని నీరు లేదా ఐస్‌ ముక్కలతో నుదురు, శరీరంపై తుడవాలి.

అరచేయి, కాళ్లకు రక్తప్రసరణ మెరుగుపడేలా రుద్దాలి.

వీలైనంతా త్వరగా వైద్యులను సంప్రదించాలి.

ఉమ్మడి పాలమూరులో తీవ్రమవుతున్న ఎండలు

పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్‌, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు.

ఊపిరాడనంత కష్టం

వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వాయువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయువుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్‌ రావడం తదితర లక్షణాలు బయటపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్‌ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్‌ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం.

– డాక్టర్‌ ప్రతిభ,

సీ్త్ర వైద్య నిపుణులు, మహబూబ్‌నగర్‌

ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి.

– డాక్టర్‌ స్వరూప్‌,

జనరల్‌ మెడిసిన్‌, మహబూబ్‌నగర్‌

రోజురోజుకూ పెరుగుతున్న

ఉష్ణోగ్రతలు

ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరిబిక్కిరి

ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ

చల్లని చెట్లతో ఉపశమనం

అంటున్న వైద్య నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement