టీచర్లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
వార్షిక పరీక్షల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు
●
మాది నిరుపేద కుటుంబం. ఎస్సెస్సీలో నాకు 580 మార్కులు వచ్చాయి. భవిష్యత్లో కలెక్టర్ కావాలని ఉంది. పేద ప్రజలకు సేవ చేయాలన్నదే నా ధ్యేయం. అందుకు నిరంతరం కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా.
– మానస, బీసీ బాలికల గురుకులం, ఉయ్యాలవాడ
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పట్టుదలతో చదవాను. అనుకున్న లక్ష్యం మేరకు 578 మార్కులు సాధించా ను. ఇందుకోసం పట్టుదల తో చదివాను. భవిష్యత్లో సాఫ్ట్వేర్ కావాలన్నదే నా లక్ష్యం. – వందన, కేజీబీవీ, ఊర్కొండ
పదో తరగతి పరీక్షల్లో 576 మార్కులు రావడం, జిల్లా సెకండ్ టాపర్గా నిలవ డం సంతోషంగా ఉంది. మొదటి నుంచి ప్రణాళిక తో చదివాను. భవిష్యత్లో ఎరోనాటికల్ ఇంజినీర్ కావాలనుకుంటున్నా. – రుత్విందర్,
బీసీ బాలుర గురుకులం, తెలకపల్లి
కందనూలు: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బుధవారం విడుదలైన ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచెయ్యి సాధించారు. జిల్లావ్యాప్తంగా 10,641 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 10,538 మంది ఉత్తీర్ణులయ్యారు. 99.03 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో 5,258 మంది బాలురకు గాను 5,192 మంది, 5,383 మంది బాలికలకు గాను 5,346 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 98.74 శాతం, బాలికలు 99.31శాతం ఉత్తీర్ణత సాధించారు.
పెరిగిన ర్యాంకు..
2024–25 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 96.83 ఉండగా.. 2025–26లో 99.03 శాతానికి చేరింది. అంటే 3 శాతం మెరుగుపడింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 13వ స్థానం ఉండగా.. ఈసారి 2వ స్థానానికి చేరింది. జిల్లాలోని 208 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో ప్రభుత్వ మేనేజ్మెంట్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు 113 ఉండగా.. రెసిడెన్షియల్ స్కూల్స్ 36, ప్రైవేటు పాఠశాలలు 59 ఉన్నాయి. జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన విద్యాశాఖ అధికారులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.
రీకౌంటిగ్, రీవేరిఫికేషన్కు అవకాశం..
విద్యార్థులు తమ జవాబు పత్రాలను రీవేరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్కుల రీకౌంటింగ్కు రూ. 500, రీవేరిఫికేషన్కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని సూచించింది. ఈ నెల 30 నుంచి మే 14వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ రాసేందుకు మే 14వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
రాష్ట్రస్థాయిలో 13 నుంచి
2వ స్థానానికి చేరిన
జిల్లా స్థానం
208 పాఠశాలల్లో వందశాతం
ఉత్తీర్ణత
ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పదో తరగతిలో 574 మార్కులు సాధించా. అత్యుత్తమ ఫలితాలతో జిల్లాలోనే మూడవ స్థానంలో నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంటర్లో ఎంపీసీ గ్రూపు తీసుకుంటా. భవిష్యత్లో ఇంజినీర్ కావాలని ఉంది. – జ్ఞానేశ్వర్, బీసీ బాలుర గురుకులం, తెలకపల్లి


