కల్వకుర్తి టౌన్: ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డుకు సంబంధించిన బృందం కల్వకుర్తిలో పర్యటించింది. గురువారం పట్టణంలోని సీహెచ్సీ ఆస్పత్రికి వచ్చిన కాయకల్ప ఎక్స్టర్నల్ బృందం సభ్యులు అభిషేక్ జాబ్ దొండపాటితోపాటు ధరమ్, చంద్రకృష్ణ ఆస్పత్రిలో కలియదిరిగారు. ఎక్కడ ఎలాంటి వసతులను రోగులకు అందిస్తున్నారని ఆరాతీశారు. అనంతరం ఇన్పేషెంట్ రోగుల వార్డులను పరిశీలించి వారితో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ల్యాబ్లు, ఇతర గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ విభాగం, ఆపరేషన్ థియేటర్, కాన్పుల గది, డైట్, మార్చురీ గది, బ్లడ్ స్టోరేజ్, ఆయుష్, డయాలసిస్ యూనిట్లను పరిశీలించారు. అలాగే ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించి, సిబ్బందిని అభినందించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించిన బృందం సభ్యులు పరిశుభ్రతపై పారిశుద్ధ్య సిబ్బందిని ప్రశంసించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై రోగులకు అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.


