కందనూలు: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ డిపోను ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిపోలో అందుబాటులో ఉన్న బస్సులు, నడుస్తున్న రూట్లు, ప్రయాణికుల రద్దీ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అంచనా వేసి, ఆ మేరకు బస్సులు నడిపించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ కలిసి గూగుల్ మీట్ ద్వారా ఆర్టీఓలు, డీఎస్పీలు, ఆర్టీసీ డిపో మేనేజర్లు తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తుందని, కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తాత్కాలికంగా నియమితులయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని హామీ ఇచ్చారు.


