ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

కందనూలు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జెడ్పీసీఈఓ దేవసహాయంతో కలిసి ప్రజల నుంచి 45 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరెట్‌ ఏఓ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 14..

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీస్‌ సేవల్ని వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణిలో ప్రజల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 4 భూమికి సంబంధించిన అర్జీలు, 8 తగు న్యాయం చేయాలని, 2 భార్యాభర్తల గొడవల ఫిర్యాదులు ఉన్నాయని, సంబంధిత పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో మాట్లాడి వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

దరఖాస్తుల స్వీకరణ

కందనూలు: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం మూడో దశ కోసం అర్హత కలిగిన యువత ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సోమవారం తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ కాలవ్యవధి 6 నెలలు, 9 నెలలు ఉంటుందని, దేశవ్యాప్తంగా సీఎస్‌ఆర్‌కు తోడ్పడే 2 వేల కంపెనీలు, ఇంటర్న్‌షిప్‌ ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.9 వేలు, ఒకేసారి చెల్లించే రూ.6 వేలు గ్రాంట్‌ పొందుతారు. పది నుంచి పీజీ చేసిన 18– 25 ఏళ్లలోపు వారు Prime MinisterInternshipscheme పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఓపెన్‌ స్కూల్‌

పరీక్షలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్‌ ఇంటర్‌ ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌లో 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1,329 మంది విద్యార్థులకు 1,250 మంది హాజరయ్యారు. ఇక ఎస్సెస్సీలో 19 పరీక్ష కేంద్రాలు ఉంటే 836 మందికి 725 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు రెండు ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌, 15 మంది సిట్టింగ్‌స్క్వాడ్స్‌ను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement