మోగిన నగారా.. మున్సిపాలిటీల్లో మరో ఎన్నిక
● నలుగురు సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ
● మైనార్టీ వర్గాల నుంచి ఇద్దరు, అనుభవజ్ఞుల నుంచి ఇద్దరి ఎంపిక
● కై వసం చేసుకునేందుకు ఆయా పార్టీల ప్రయత్నాలు
● మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావాహులు
ఎన్నిక ప్రక్రియ ఇలా..
మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో కమిషనర్లు మార్గదర్శకాలు విడదల చేశారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో మొదటి సమావేశం జరిగి 60 రోజులకుపైగా అవుతోంది. పది రోజుల వ్యవధిలో నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ జారీ చేసిన 7 రోజుల వ్యవధిలో పోటీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. అందిన దరఖాస్తులను మూడు రోజుల వ్యవధిలో కమిషనర్ పరిశీలించి జాబితాను రూపొందించి కౌన్సిల్ ఎదుట ప్రవేశపెట్టాలి. సభ్యులతోపాటు ఎక్స్అఫీషియో సభ్యులకు ముందుస్తుగా సమాచారం అందించి ప్రత్యేక సమావేశం ఎన్నిక తేదీని ఖరారు చేయాలి. ఈ సమావేశానికి కోరం కోసం కనీసం 50 శాతం సభ్యులు హాజరుకావాలి. పోటీ ఉన్న పక్షంలో సభ్యులు చేత్తులెత్తే విధానం ద్వారా సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అత్యధిక మున్సిపాలిటీల్లో అధికార పక్ష సభ్యులు మెజార్టీ ఉండటంతో అన్ని మున్సిపాలిటీల్లోనూ కోఆప్షన్ పదవులు వారే దక్కించుకునే అవకాశం ఉంది.
అచ్చంపేట: మున్సిపాలిటీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందడి మొదలైంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ సైతం జారీ అయ్యింది. దీంతో ప్రధాన పార్టీల్లో ఆశావాహులు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సభ్యుల ఎంపిక ఏకగ్రీవమవుతుందా.. లేదా ఎన్నిక అనివార్యం కానుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ రూల్స్–2020 ప్రకారం నలుగురు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ నెల 24లోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లు వెల్లడించారు. జిల్లాలో అచ్చంపేట మినహా నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. నూతన మున్సిపాలిటీల్లో తొలి సమావేశం జరిగిన 90 రోజుల వ్యవధిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక సమావేశం గడువు దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు జీఓ జారీ చేసింది. ఎన్నిక విధివిధానాలను విడుదల చేసింది. ఈ మేరకు ఆయా మున్సిపల్ కమిషనర్లు కోఆప్షన్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు.


