● వర్షానికి తడిసిన మొక్కజొన్న పంట
● తాటిచెట్టుపై పిడుగుపడి గీతా కార్మికుడికి గాయాలు
వెల్దండ: అన్నదాతలను అకాల కష్టాలు చుట్టుముట్టాయి. మంగళవారం సాయంత్రం వెల్దండతోపాటు కంటోనిపల్లి, చెర్కూర్ గ్రామాల్లో అకాల వర్షం కురవడంతో మొక్కజొన్న పంట తడిసిపోయింది. మొక్కజొన్న విక్రయించడానికి వెల్దండలోని సింగిల్ విండో కార్యాలయానికి తీసుకురాగా.. వర్షం రావడంతో పంట తడిసిపోయింది. గన్నీబ్యాగులు సరఫరా చేయకపోవడంతో పంట తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మండలంలోని అజిలాపూర్ గ్రామానికి చెందిన గునగంటి వెంకటయ్యగౌడు పిడుగు పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటయ్యగౌడు గ్రామ సమీపంలోని కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కగా.. ఒక్కసారిగా ఉరుములు, మెరుపు వచ్చి అతను ఎక్కిన తాడిచెట్టుపై పిడుగు పడింది. దీంతో తాటిచెట్టు నుంచి కొంత వరకు కిందకు జారి ఆగిపోయాడు. గమనించిన రైతులు అక్కడికి చేరుకుని చెట్టు కిందకు దించి.. చికిత్స నిమిత్తం ఇర్విన్ గ్రామంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.


