బల్మూర్/తెలకపల్లి: వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని.. ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు రవీందర్ నాయక్ హెచ్చరించారు. ఆదివారం బల్మూరు, తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆరోగ్యకేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ల్యాబ్, మందుల నిల్వలతో పాటు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోజువారీగా ఔట్ పేషంట్లు, ఇన్ పేషంట్ల వివరాలను వైద్యాధికారులతో తెలుసుకున్నారు. వైద్యసిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని.. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్య తెలుసుకోవాలని సూచించారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలన్నారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య కార్యక్రమాలకు వందశాతం పూర్తిచేయాలని సూచించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కుక్కకాటు, పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆయన వెంట డీఎంహెచ్ఓ రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్, వైద్యులు విష్ణు, కృష్ణమోహనన్ ప్రదీప్ సురేశ్బాబు, రాజగోపాలాచారి, హెల్త్ సూపర్వైజర్ ఉమ, అసిస్టెంట్ రెడ్యానాయక్, ఫార్మసీ ఆఫీసర్ శ్రీనివాసులు ఉన్నారు.
రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు రవీందర్ నాయక్


