కందనూలు: విశ్రాంత, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపుమేరకు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నాన్ గెజిటెడ్, విశ్రాంత ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, వేతన సవరణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దుపరిచి ఓపీఎస్ అమలు వంటి ప్రధాన సమస్యలతోపాటు తదితర అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు యుగంధర్రెడ్డి, శ్రీనివాసులు, నర్సయ్య, బాలస్వామి, శ్రీనివాసులు, పాండురంగయ్య, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


