తల్లిదండ్రులకు అండగా టీఈఏఎంపీఎస్ చట్టం
ఫిర్యాదు ఇలా..
● బిల్లు పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు
● నిర్లక్ష్యం చేస్తే వేతనం నుంచి
15 శాతం కోత
● బాధితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేసేలా చట్టం
●
అచ్చంపేట: కనిపెంచి.. పెద్దచేసి.. ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసిన తల్లిదండ్రుల పట్ల కొందరు సంతానం చివరాంకంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోషణ బాధ్యతల నుంచి తప్పించుకుని ఆశ్రమాల్లో చేర్పిస్తున్నారు. కారణాలు ఏదైనా తల్లిదండ్రులను దూరం పెడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి మెట్లు ఎక్కుతున్న ఇలాంటి బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడమే ఇందుకు నిదర్శనం. తమ కొడుకులు పోషించడం లేదని, మలి వయస్సులో ఆసరాగా ఉండటం లేదని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరంటల్ సపోర్టు యాక్ట్–2026(టీఈఏఎంపీఎస్) బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఆమోదించింది. ఇది పిల్లల చేత నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులకు అండగా నిలువనుంది.
బాధిత తల్లిదండ్రులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కలెక్టరేట్లో ఫిర్యాదు చేయవచ్చు. కేవలం 45 రోజుల్లోనే సమస్యను పరిష్కరించేలా గడువు విధించడం ఈ చట్టంలోని మరో ముఖ్యమైన అంశం. ఒకవేళ కలెక్టర్ తీర్పుతో సంతృప్తి చెందకపోతే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ను కలిసే వెసులుబాటు కూడా కల్పించారు. తల్లిదండ్రులను పోషించే బాధ్యత పూర్తిగా పిల్లలదే. వారు పట్టించుకోకపోతే నిర్భయంగా 14567 హెల్ప్లైన్ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు.


