తిమ్మాజిపేట: జిల్లాలోని కేజీబీవీల నిర్వహణలో సిబ్బంది ఎలాంటి అలసత్వం వహించొద్దని డీఈఓ రమేష్కుమార్ అన్నారు. గురువారం ఆయన తిమ్మాజిపేటలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యాలయం నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రత్యేకాధికారి, ఉపాధ్యాయులు పనిచేయాలని పిలుపునిచ్చారు. భోజన నాణ్యతలో రాజీ లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఆర్జేడీ సోమిరెడ్డి ఆదేశాల మేరకు కేజీబీవీకి 10 కంప్యూటర్ టేబుళ్లను అందజేసి.. ల్యాబ్ను ప్రారంభించారు. పాఠశాలలో వసతులను పరిశీలించి.. వంట గదులను తనిఖీ చేశారు. ఆహారం తయారీ విధానం, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం సక్రమంగా అందుతుందా అనే విషయాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఉండే సౌకర్యాలు తాగునీరు, విద్యాబోధన, పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, ఎస్ఓ సుజాత, ఉపాధ్యాయులు ఉన్నారు.


