కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ గీతాంజలి తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్లను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్మేళా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని.. ఈ అవకాశాన్ని జిల్లాలోని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డ్రగ్స్ మహమ్మారికి
అడ్డుకట్ట వేద్దాం
కందనూలు: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సీఐ శంకర్నాయక్ అన్నారు. నాగర్కరూ్న్ల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జిల్లా విద్యాశాఖ, ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలతో భవిష్యత్ నాశనమవుతుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు.కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, రిసోర్స్పర్సన్లు తిరుపతయ్య, లక్ష్మీప్రసన్న, వెంకటయ్య, నార్కోటిక్ కానిస్టేబుల్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
గ్రానైట్ తవ్వకాలు
నిలిపివేయాలి
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల శివారులో సర్వేనం 182లో చేపట్టిన బ్లాక్ గ్రానైట్ తవ్వకాలను నిలిపివేసి.. వన్యప్రాణులను రక్షించాలని సిర్సనగండ్ల, శాంతిగూడెం గ్రామాల రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం ఫారెస్టు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుట్ట ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలతో పర్యావరణ దెబ్బతినడంతో పాటు వన్యప్రాణులకు హాని చేకూరుతుందన్నారు. పశు సంపద, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. అధికారులు స్పందించి అటవీ సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.


