బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అలివేలుమంగ, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల శ్రీమన్నారాయణచార్యుల ఆధ్వర్యంలో గరుడ పతాకావిష్కరణ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో పురవీధుల్లో ఊరేగించారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 7 నుంచి ఆలయాన్ని మూసివేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత ఆలయాన్ని తెరిచి ప్రక్షాళన చేశారు. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగించారు.
పర్యాటకాభివృద్ధికి కృషి
కొల్లాపూర్ రూరల్: రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు జిల్లా టూరిజంశాఖ అధికారి నర్సింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్ను ఆయన కలిసి పర్యాటకశాఖ డైరీ, క్యాలెండర్ అందజేశారు. అనంతరం సోమశిల–అలంపూర్ టూరిజం సర్క్యూట్లో భాగంగా సోమశిల, సింగోటం, జటప్రోలు, కొల్లాపూర్ కోట తదితర ప్రాంతాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలపై కలెక్టర్తో చర్చించారు. త్వరలో పర్యాటకశాఖ తరఫున జిల్లా ఫారెస్టు, రెవెన్యూ, దేవాదాయ, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమావేశమై.. సోమశిల–అలంపూర్ టూరిజం సర్క్యూట్పై సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారని ఆయన తెలిపారు.
1,772 డోసుల హెచ్పీవీ టీకాల కేటాయింపు
నాగర్కర్నూల్ క్రైం: జిల్లా వ్యా క్సిన్ స్టోర్కు మొదటి విడతగా 1,772 డోసుల హెచ్పీవీ (హ్యూ మన్ పాపిల్లోమా వైరస్) టీకాలు కేటాయించినట్లు ఇన్చార్జి డీఎంహెచ్ఓ డా.రవికుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యాక్సిన్ స్టోర్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీకాల నిల్వను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో జనరల్ ఆస్పత్రి, సివిల్ ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇన్చార్జి డీఎంహెచ్ఓ వెంట జిల్లా వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్ ఉన్నారు.


