గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు గత రెండేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారింది. గత డిసెంబర్ నెలలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినప్పటికి ఎంపీటీసీ ఎన్నికలు మే నెలలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ స్పష్టత లేదు. ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తేనే మండలాల్లో మండల సభలు నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. ఎంపీటీసీ సభ్యులు లేకపోతే మండల సభలు నిర్వహించేందుకు వీలు లేదు. దీంతో సర్పంచ్లు గ్రామ పంచాయతీల్లోనే గ్రామసభలు నిర్వహించుకుంటున్నప్పటికీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి సర్పంచ్లకు నెలకొంది. మండల సభకు మాత్రమే అధికారులు హాజరవుతారే తప్ప గ్రామసభలకు అధికారులు హాజరయ్యే పరిస్థితి ఉండదు. మండలస్థాయి అధికారులతో తమ గ్రామ సమస్యలు చెప్పుకునేలా ఉన్నతాధికారులు స్పందించి మండల సభలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్లు కోరుతున్నారు.


