మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానంలో ఈనెల 27 నుంచి మే 6వ తేదీ వరకు జరగనున్న లక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాలకు పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కను ఆహ్వానిస్తూ ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి వీరస్వామి శుక్రవారం ఆహ్వాన పత్రికను అందించారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 1న మధ్యాహ్నం 12.23 గంటలకు నిర్వహించే స్వామివారి తిరుకల్యాణానికి రావాలని కోరారు. అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు కూడా స్వామివారి ఆహ్వాన పత్రికను అందించారు.
మల్హర్(కాటారం): కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో ఈ నెల 20న ముఖ్యమంత్రి బహిరంగ సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించిన కలెక్టర్ వేదిక ఏర్పాట్లు, ప్రాంగణ అభివృద్ధి, లైటింగ్, పార్కింగ్, భద్రత తదితర అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్కుమార్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీఓ వీరస్వామి, విద్యుత్ డీఈ నాగరాజు పాల్గొన్నారు.
లైటింగ్ ఏర్పాట్ల పరిశీలన
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎల్పీఓ మల్లికార్జున్రెడ్డి అధికారులను ఆదేశించారు. నస్తూరిపల్లి లైటింగ్ ఏర్పాట్లు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ నాగరాజు, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


